సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. సుధీర్ కు జోడిగా కృతిశెట్టి నటించారు. నిర్మాతలు బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి బెంచ్మార్క్ స్టూడియోస్పై మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో సినిమా సక్సెస్ విశేషాలు పంచుకున్నారు హీరోయిన్ కృతిశెట్టి.
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలిలో మీ పాత్రకు చాలా మంచి స్పందన రావడం ఎలా అనిపించింది?
నిజ జీవితానికి చాలా దగ్గరగా వున్న పాత్ర ఇది. అందుకే ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. చాలా మంది ఫోన్ చేసి ”నన్ను నేను స్క్రీన్ పై చూసుకున్నట్లువుంది” అని చెపుతుంటే చాలా ఆనందంగా వుంది. ఒక నటికి ఇంతకంటే కావాల్సింది ఏముంది. ఇంత మంచి పాత్రని ఇచ్చిన ఇంద్రగంటి గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా విజయం నాకు చాలా ప్రత్యేకం.
మొదటిసారి ద్విపాత్రాభినయం చేయడం ఎలా అనిపించింది?
కెరీర్ బిగినింగ్ లోనే ద్విపాత్రాభినయం చేసే అవకాశం రావడం ఆనందంగా వుంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. అఖిల పాత్రని చాలా మంది ఇష్టపడుతున్నారు. ఒక నటిగా చాలా ఆనందంగా వుంది. నిజానికి నేను డాక్టర్ ని కావాలని అనుకున్నాను. ఒక యాడ్ ఫిల్మ్ షూటింగ్ కోసం హైదరాబాద్ రావడం, తొలి సినిమా ఉప్పెన అవకాశం దొరకడం, తర్వాత మంచి మంచి పాత్రలు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. మరింత కష్టపడి మరిన్ని మంచి పాత్రలు , సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.
సుధీర్ బాబు గారితో పని చేయడం ఎలా అనిపించింది?
సుధీర్ బాబు గారు వండర్ఫుల్ కోస్టార్. ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా వుంది. చాలా అంకిత భావంతో పని చేస్తారు. చాలా స్ఫూర్తిని నింపుతారు. సెట్స్ లో ఎంతో సహాయంగా వుంటారు. చాలా సున్నితమైన వ్యక్తి. ఆయనకి చాలా సలహాలు అడిగాను. ఎప్పుడూ చిరాకు పడలేదు. ఈ విషయంలో సుధీర్ బాబు గారికి కృతజ్ఞతలు.
కొత్తగా చేస్తున్న సినిమాలు?
నాగ చైతన్య, సూర్య గారి తో సినిమాలు చేస్తున్నా.