విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా మట్టి కుస్తీ. ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది. ఆర్ టీ టీమ్వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ నేపధ్యంలో కథానాయిక ఐశ్వర్య లక్ష్మి విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మట్టి కుస్తీ కథని ఎప్పుడు విన్నారు?
మూడేళ్ళ క్రితం కోవిడ్ కి ముందే మట్టి కుస్తీ కథ విన్నాను. నాకు చాలా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్ తో కూడుకున్నది. ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పా. తర్వాత కోవిడ్ వచ్చింది. మూడేళ్ళ తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఈ గ్యాప్ లో కొన్ని సినిమాలు చేయడం వలన కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో మట్టి కుస్తీ ని చేయాలని నిర్ణయించుకున్నా.
మట్టి కుస్తీ లో అంత సవాల్ గా అనిపించిన అంశాలేంటి?
పాత్ర చాలా ఫిజికల్ వర్క్ ని డిమాండ్ చేస్తుంది. దానికి చాలా ప్రిపరేషన్ కావాలి. ట్రైలర్ లో స్టంట్స్ చూసే వుంటారు. ఎమోషనల్ సీన్స్ ని చేయడం నాకు ఇష్టమే. కామెడీ అనేది నా వరకూ చాలా కష్టం. మొదటి సారి ఇందులో కామెడీని ప్రయత్నించా. ఇదివరకు నేను చేసిన పాత్రల్లో కామెడీ లేదు. మట్టి కుస్తీ నాకు ఓ సవాల్. ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో తెలీదు. దర్శకుడు నా ఫెర్ఫార్మెన్స్ పట్ల చాలా ఆనందంగా వున్నారు. ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం వుంది.
మట్టి కుస్తీ ఎలా ఉండబోతోంది?
మట్టి కుస్తీ ఫ్యామిలీ డ్రామా. ఇది భార్యభర్తల కుస్తీ(నవ్వుతూ). కుస్తీ, ఇగో, వినోదం అన్నీ ఎలిమెంట్స్ వుంటాయి. ప్రతి ఒక్కరూ మట్టి కుస్తీకి కనెక్ట్ అవుతారు. ఇంత చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్, వినోదం వున్న చిత్రం ఈ మధ్య కాలంలో రాలేదు. ఆడ మగ సమానమే అనే సందేశాన్ని చాలా వినోదాత్మకంగా చూపించాం. పైసావసూల్ మూవీ మట్టి కుస్తీ.