ఆహా, సితార ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్లో రూపొందిన తెలుగు ఒరిజినల్ ఫిల్మ్ ఇంటింటి రామాయణం. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆహాలో డిసెంబర్ 16 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది.
టీజర్ లాంచ్ సందర్భంగా సినిమా కి షో రన్నర్గా వ్యవహరించిన డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ, ‘‘ఆహాలో ఇంతకు ముందు త్రీ రోజెస్ రూపొందించిన సంగతి తెలిసిందే. అదే అనుబంధంతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇంటింటి రామాయణంను రూపొందించాం. ఈ కథ మీ హృదయానికి హత్తుకోవటమే కాదు.. మీరు ప్రేమించిన వ్యక్తులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుకుతెస్తుంది. నేటి రోజుల్లో మన వ్యక్తిగత జీవితాల్లోని భావోద్వేగాలను ఎమోజీల రూపంలో వ్యక్తం చేస్తున్నాం. కానీ ఆహాలో రాబోతున్న ఈ ఇంటింటి రామాయణం సినిమాను వీక్షించినప్పుడు మీ ఇంటి సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతారు. ఒకవేళ వారు ఇతర ప్రాంతాల్లో ఉంటే వెంటనే టికెట్ బుక్ చేసుకుని వెళ్లి వారిని కలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. అంత సరళంగా అందరికీ అర్థమయ్యేలా ఉండటమే ఈ సినిమాకు ప్రధాన బలం’’ అని అన్నారు.